ఈ సంపుటిలో 24 కథలున్నై. కథావస్తువుల్లోని వైవిధ్యాన్ని ఒక్క పోలికతో చెప్పాలంటే - అవన్నీ ఇంటింతా జరుగుతున్న రామాయాణాలు, మహాభారతాలూ కొన్ని కొన్ని మహా భాగోతాలు!
మొదటి కథ 'మేనిక్విన్'. క్లాత్ షాప్లో బొమ్మకు చీర కట్టే 'మనిషి'లోని నైతికత మానవీయ విలువల పట్ల ఆరాధనాభావం ఉన్నతీకరించబడినై. బట్టలిప్పి బజారున పడుతున్న స్త్రీల నగ్న ప్రదర్శనల వర్తమానత మధ్య ఇలాంటి ఆశయచోదకమైన కథని అందించారు మణిగారు.
'అన్వేషి' కథ - 'ఆనందం పొందాలనే కార్యాలకన్నా ఇతరులకు ఆనందాన్నిద్దామనే ఊహతో చేసే కార్యాలు ఎక్కువ ఆనందాన్నిస్తాయ'నే సందేశాన్నిస్తుంది.
బతుకు అర్థాన్నీ, పరమార్థాన్నీ తెలుపుతుంది 'రెయిన్బో టైలర్స్' - బిటెక్ చదువుకుని కూడా తండ్రి వృత్తిని కొనసాగిస్తూ, పది మందికీ జీవికని కూర్చిన మంచి మనిషి కథ.
'పత్రహరితం' కథ డైరీల ఆధారంగా సాగుతుంది. ఇతరుల్ని చూసి తమకు తాము లక్ష్యశుద్ధిని పొందేవారి కథ.
'అనుబంధం' మానవ సంబంధాల్లోని మాధుర్యాన్ని చూపుతుంది.
ఈ సంపుటికంతా వన్నె తెస్తున్న రెండు మంచి కథల్లో ఒకటి 'జీళ్ళ సూరిబాబు'. అతనొక ప్రత్యేక పాత్ర. రౌడీతనం నుంచీ మంచిని పంచే వాస్తవానికి నడిచి వచ్చిన 'మనిషి'! రెండవ కథ - ఈ సంపుటికి శీర్షికగా ఎన్నుకున్న 'వాత్సల్య గోదావరి'. ఒక బడుగు బాపని, పురోహితుని కథ! లేమిలో ఆశాభావం కలిమిని తన వ్యక్తిత్వంలో స్థిరపర్చుకున్న సుబ్బుశాస్త్రి జీవన శకలం ఈ కథ.
ఇలాగే మిగిలిన కథలన్నిటా బతుకు గీతల్లోని వక్రతలూ, సరళతలూ ఆవిష్కరించబడినై.
పేజీలు :200