పల్నాటి చరిత్రలోని చాలాభాగం మసకబారిందని గ్రహించాను. శ్రీనాథుని పలనాటి వీరచరిత్రను నీడలోవుంచి ఆ రచనకు భిన్నంగా కలాలు నడిపిన రచయితలు, కవుల వక్రీకరణలే ప్రజాప్రపంచంలోకి వ్యాప్తి చెందాయి. బ్రహ్మనాయుడు ఆయన వర్గీయుల వ్యక్తిత్వాలను మహోన్నతంగానూ, నాయకురాలి వ్యక్తిత్వాన్ని కలుషితంగానూ రూపొందించారు. శ్రీనాథుని పలనాటి వీర చరిత్రలో మనకు ప్రస్తుతం కల్లిపోరు, బాలచంద్రయుద్ధం అనే రెండు ఘట్టాలే లభిస్తున్నాయి. ఒక్క బాలచంద్రయుద్ధం పర్వంలోనే బ్రహ్మనాయుని మరియు బాలచంద్రుని అనేక దుష్కర్మలు, ఆగడాలు వెలుగుచూస్తున్నాయి. నాయకురాలి ఘనమైన సత్ప్రవర్తన, శాంతియుతమైన ఆశయాలు మనకు బోధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పల్నాటి చరిత్రకు సంబంధించి మరిన్ని వాస్తవాలను ప్రపంచం ముందుకు తీసుకురావాలన్న నాప్రయత్నమే ఈ శాంతిదూత నాయకురాలు రచన. - రచయిత |