ఆచరణే బోధనగా అవతరించిన అవధూత సాయినాథుడు. సుమున్నత గురుపరంపరలో ఆయన ఓ గౌరిశంకర శిఖరం. ఆ శిఖరాన్ని రచయిత తనదయిన కోణంలో దర్శించి, తరించి, సాయిలీలా విభూతుల్ని ఇందులో అక్షర సమార్చన చేశారు. ఈ ప్రయత్నం వెనుక పవిత్రత ఉంది. పరిశోధన ఉంది. అనేక గ్రంథాల్ని పరిశీలించి, సాయి అవతారాన్నీ, సద్గురు జీవిత విశేషాల్నీ గుచ్చెత్తిన నైపుణ్యం ఉంది. ఆధ్యాత్మికం అనగానే కొండెక్కి కూర్చోకుండా చదువరుల హృదయాలకు చేరువగా వెళ్ళాలన్న తపన, తపస్సాధన సాయిబాబా సన్నివేశాల సృజనలో స్పష్టంగా కనిపిస్తాయి. 'నవ్యవీక్లి'లో ముప్పయి మూడు వారాలపాటు పాఠకుల్ని రంజింప చేసిన ఈ ధారావాహికను రాసిన 'శివసతీపురం శర్మ' మరెవరో కాదు. అరణి, అనీలజ, లహరి వంటి కలం పేర్లతో అద్భుతంగా రాస్తున్న ప్రముఖ కథా రచయిత జగన్నాథశర్మే! ఇందులోని శైలీ శిల్పాల మీద వారి సంతకం స్పష్టంగా కనిపిస్తుంది.
పాఠకుల్ని గుక్క తిప్పుకోనివ్వకుండా చదివిస్తూ, సాయి తత్వాన్ని సరికొత్త కోణంలో సందర్శింపజేసే మంచి పుస్తకాల్లో ఇది ఒకటి. సాయి భక్తులు దీనిని తప్పకుండా చదవాలి.
వారం వారం సాయి పారాయణం మనల్ని మనం తెలుసుకునేందుకు, మనిషిగా బతికేందుకు ఉపకరిస్తుంది.
- ఓలేటి శ్రీనివాసభాను