పదే పదే అదే కథా? మళ్ళీ రామకథేనా? వేదాల్లో, బృహత్కథలో, పురాణాల్లో ఎన్ని గొప్ప కథలు లేవని? ఆ కథలేవీ పనికిరావన్నట్టుగా ప్రతి కవికీ, రచయితకీ రామకథే ఎందుకు అంటే, తమ రచనకి రాముడు అంతటి మహోన్నతమూర్తి మరొకరు లేరంటారు వారంతా. రాముడు ధర్మసూత్రాలతో తీర్చిదిద్దిన శిలావిగ్రహం కాదు, రక్తమాంసాలతో కదిలే నిండైనమనిషి. ఆయనకీ కలలు ఉన్నాయి. కన్నీళ్ళున్నాయి. బాధలు ఉన్నాయి. భయాలు ఉన్నాయి. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడాయన. వాటితో యుద్ధం చేశాడు. జయించాడు. ఆ జితేంద్రియుని జీవితకథ చెప్పడంలో అందం ఉంది. ఆనందం ఉంది.
రామాయణ పారాయణం శుభాలను కలిగిస్తుందనీ, కీర్తిప్రతిష్టలను పెంపొందిస్తుందనీ చెప్పడం అతిశయోక్తి అవుతుందేమోగాని, ఆ పారాయణం మట్టిబొమ్మని మనిషిని చేస్తుంది. ఇది నిజం. ఈ నిజాన్ని ఆదికవి వాల్మీకి సంస్కృతంలో చెబితే దానిని ఆబాలగోపాలానికీ అందమైన వ్యావహారికభాషలో ఆనందంగా చెప్పారు అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మ.