తెలుగులో యాత్రాచరిత్రలు కొత్తకాదు. ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర నుండి ఆదినారాయణ భ్రమణకాంక్ష దాకా రాహుల్ సాంకృత్యాయన్ లోకసంచారి నుంచి బి.వి.రమణ ట్రెక్కింగ్ అనుభవాలదాకా తెలుగు సాహిత్యప్రపంచాన్ని సుసంపన్నం చేసిన యాత్రాచరిత్రలెన్నో ఉన్నాయి. ఆ కోవలోనే వాడ్రేవు చినవీరభద్రుడు రాస్తూ వచ్చిన యాత్రారచనల సంకలనం ఇది. ఇందులో 1997లో ఇంగ్లాండ్ సందర్శించినపుడు రాసిన యాత్రానుభవాలతో పాటు ఇండియాటుడే తెలుగపత్రిక కోసం అరకులోయ, నల్లమల దారులు, పాపికొండల నడుమ సంచరించిన యాత్రాకథనాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక స్థలాలయిన అరుణాచలం, బృందావనం, త్రయంబకంలతో పాటు జైన, బౌద్ధ క్షేత్రాలయిన శ్రావణ బెళగొళ, సాంచిల సందర్శనానుభవాలూ, ఆదిమమానవుడి గుహాచిత్రాలతో పాటు అద్భుతమైన శిల్పరమణీయత వెల్లివిరిసే హళెబీడు, బేలూరుల దాకా ఎన్నో చారిత్రకస్తలాల పర్యటన వివరాలు ఇందులో నిక్షిప్తం. ఢిల్లీ నుంచి రాసిన ఉత్తరాలతో పాటు కాశీయాత్ర అనుభవాల కథనం ఈ సంపుటిలో ప్రత్యేక ఆకర్షణ.
పేజీలు : 232