కాశీనగరానికి పడమర దిశలో మూడు నూర్ల అమడల దూరంలో భూచక్రపురం అనే ఒక పట్టణం వుంది. సూర్యవంశానికి చెందిన నవభోజరాజు భూచక్రపురాన్ని మహావైభవంగా పరిపాలిస్తున్నాడు. ఆయన పాలనలో ప్రజలకు ఎలాంటి చీకూ చింతాలేదు. హాయిగా జీవిస్తూ ఆనందంగా గడుపుతున్నారు.
నవభోజరాజు పట్టమహిషి భూలక్ష్మిదేవి. పేరుకు తగ్గట్టుగానే ఆమె వంటి గుణవంతురాలు, సౌశీల్యరాశి మరొకరు కానరారు. అనుక్షణం ప్రభువు క్షేమం, ప్రజల మంచి చెడులు విచారించే మహాపతివ్రతాశిరోమణి ఆమె.
అంతటి సుగుణాలరాశికి ఒక్కటే చింత. సంతాన భాగ్యం లేకపోవడంతో ఆ రాజ దంపతులు నోచని నోములేదు. చేయని వ్రతం లేదు. ఎన్నో తీర్థయాత్రలు చేసి ఎన్నో క్షేత్రాలను భక్తి ప్రవర్తులతో సేవించారు. లెక్కకు మిక్కిలి దాన ధర్మాలు చేశారు.
మరెన్నో నాగ ప్రతిష్ఠలు చేశారు. బ్రాహ్మణ బాలురకి ఉపనయనాలు చేయించి వివాహాది శుభకార్యాలు జరిపించారు. మంచి నీటి చలివేంద్రాలు పెట్టించి, అన్నసత్రాలు కట్టించారు. నిత్యాన్న సమారాధనలు చేయిస్తున్నా కూడా వారికి సంతానం కలగలేదు.
ఒక దినం నవభోజరాజు కొలువు ముగించి అంత:పురం చేరుకున్నాడు. అంత:పురంలోని కొలనులో పన్నీటి స్నానం చేసి వెండి పీటమీద ఆశీనుడై బంగారు పళ్ళెంలో నవకాయపిండి వంటలతో అమృత ప్రాయమైన విందుభోజనాన్ని ఆరగించాడు....
పేజీలు : 136