ఆధునిక సారస్వతాకాశంలో తారాజువ్వలా లేచి కళ్ళు జిగేలుమనిపించి ''కాలాతీత వ్యక్తులు'' నవల ద్వారా ధ్రువతారగా నిల్చిపోయింది. తన విశేషమైన శైలి, భాషాస్వామ్యం, అతి సాహసమైన భావ ప్రకటన, అపూర్వమైన పాత్ర సృష్టి, శిల్ప చాతుర్యం వలన అశేష పాఠకలోకం, పత్రికల ప్రశంసలనందుకొన్నది. ఈమె సంస్కార హృదయం సాహిత్య లోకానికి అందించిన రచనలు ఇంకా అనేకం. తెలుగు కలం బలం చాటే అనేకమైన ఆణిముత్యాల్లాంటి కథలు, గేయాలు ముఖ్యంగా ''మధుకలశం'' (ఉమర్ఖయ్యం) కవితా సుమం, ఉరుములు - మెరుపులు, కల తెచ్చిన రూపాయిలు కథా సంకలనాలూ, అనేక దీర్ఘ కవితలూ రాశారు. వ్యక్తిగా శ్రీదేవి యువతరంలో విశ్వాసం కనబరచిన ప్రగతిశీలి, ఆత్మస్థైర్యపరురాలు. స్త్రీ జాతి చైతన్యానికి ఒక ప్రతీక ఈమె వ్యక్తిత్వం. ఈమె ''కాలాతీత వ్యక్తులు'' నవల కోసమే జన్మించిందా అనిపిస్తుంది. ''కాలాతీత వ్యక్తులు'' సంప్రదాయ ధీరత్వాన్ని ఎదిరించిన ఒక లోకం - ఆ లోకంలో కోరిక, ప్రేమ, బాధ, సంతోషం, నిజం, అబద్ధం అన్నీ వున్నాయి. అన్నింటికన్నా మిన్నగా - నిజంగా బతకటం ఏమిటో, ఎలాగో తెలిపే భావనుంది. ఆ లోకం మీ ముందుంది... ప్రవేశించండి - ప్రవేశించి జీవన ప్రతిస్పందనని స్వంతం చేసుకోండి. ఈ నవలే సాహితీ ప్రపంచంలో ఈమెకొక ఉజ్వల స్మృతి చిహ్నం. శ్రీదేవి చిర యశస్వి. |