తెలుగు కథకు వస్తు నవ్యత, శిల్ప సౌష్టవాన్ని కలిగించి కథానిక సాహిత్య విస్తృత ప్రాచుర్యానికి తోడ్పడ్డ ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్. సజీవమైన భాష, సరళమైన శైలి, నిరాడంబరమైన శిల్పం, సూక్ష్మమైన మానసిక విశ్లేషణ, విప్లవాత్మకమైన భావసంపద, హేతుబద్ధమైన శాస్త్రీయవిజ్ఞానం, వ్యంగ్యాత్మకమైన వ్యాఖ్యానాలతో కూడినవి గోపీచంద్ కథానికలు.
మేథావిగా, దార్శనికునిగా, అభ్యుదయవాదిగా, మానవతావాదిగా, వేదనాశీలిగా వ్యక్తిత్వాన్ని పండించుకున్న గోపీచంద్ తన కలం బలంతో గట్టి సాహిత్యాన్ని సృష్టించారు. ఆలోచనలతో తపించి అంతర్మథనంతో జ్వలించి రచనలు చేశారు. గోపీచంద్ రచనలు నిరంతర పరిణామ శీలమైన వారి వ్యక్తిత్వ ప్రతిబింబాలు.
తెలుగు కథానిక సాహిత్య ప్రక్రియలో రెండోతరానికి చెందిన ఉన్నత శ్రేణి రచయిత. తెలుగు కథకు జవసత్వాలు కలిగించిన ఉత్తమ రచయిత గోపీచంద్.
ఆయన కథానిక సాహిత్యానికి ప్రాతినిధ్య రూపం ఈ కథల సంపుటి.
ఈ కథా సంపుటిలో కార్యశూరుడు, పిరికివాడు, ధర్మవడ్డీ, సరే కానివ్వండి, పాతపగలు - కొత్తవగలు, ఆపద్బాంధవ్యం, మమకారం, స్వయంపాకం, చెప్పులు కుట్టేవాడు, అహం, సానుభూతి, ధర్మ ఆసుపత్రి, జనానా అనే 13 కథలు ఉన్నాయి.
పేజీలు : 114