చికిత్స చేసే వైద్యునికి ఆయా వ్యాధుల గురించి పరిపూర్ణ జ్ఞానం వుండకపోతే ఎంత ప్రమాదమో, డయబెటిస్ లాంటి దీర్ఘకాల వ్యాధుల్లో రోగికి ఆ వ్యాధి పట్ల కనీస పరిజ్ఞానం లేకపోవడం కూడా అంతే ప్రమాదం!
శరీరంలో ప్రతి అవయవం మీద తన ప్రభావం చూపిస్తుంది డయబెటిస్. అలాంటి వ్యాధి నివారణకు, ప్రాథమిక దశలో చికిత్సకూ వ్యాధిగ్రస్తులు తగినంత అవగాహన, ఆరోగ్య శిక్షణ పొందడం చాలా ముఖ్యం. సరైన చికిత్స పొందుతూ, రాబోయే చిక్కులను నివారించుకోవడానికి డయబెటిస్ గురించి ప్రతి రోగీ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.
మధుమేహ వ్యాధి అన్ని దేశాల్లోలాగే, మన దేశంలో కూడా ఉధృతంగా పెరుగుతున్నది. ఇటీవలి అంచనాల ప్రకారం మన దేశంలో 62 మిలియన్ల (6.2 కోట్లు) మందికి ఈ వ్యాధి ఉన్నది. 2030 నాటికి అన్ని దేశాలకంటే ఎక్కువగా మన భారతదేశంలో సుమారు 80 మిలియన్ల (8 కోట్లు) మందికి మధుమేహం ఉండబోతున్నది.
వ్యాధి అదుపులో లేకుంటే వచ్చే రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి, డయబెటిక్ కోమా, గాంగ్రీన్ మొదలైన సమస్యలను వివరిస్తూ అలాంటి వాటి నుండి రక్షణ పొందేందుకు తగిన సూచనలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
వ్యాధిగ్రస్తులు వ్యాధి గురించి అవగాహన పెంచుకుని, తగు శ్రద్ధతో చికిత్స పొందుతూ, ఆహార నియమాలను పాటిస్తూ వ్యాధిని అదుపులో వుంచుకుని, సంపూర్ణ ఆరోగ్య వంతునిలా ఉల్లాసంగా గడపటానికి ఈ పుస్తకం ఒక మార్గదర్శి.
ప్రముఖ వైద్య నిపుణులైన డా. పి.దక్షిణామూర్తి విశిష్ట రచనా నైపుణ్యంతో, సులభశైలిలో, డయబెటిస్ గురించి రచించిన వైజ్ఞానిక గ్రంథం 'డయబెటిస్ గైడ్'.
డయబెటిస్ రోగులు ఈ పుస్తకం ఇంట్లో వుంచుకుంటే సరి!
నిపుణులైన డాక్టర్ సదా వెన్నంటి వున్నట్లే మరి!!